Monday, September 17, 2012

కారణమాలాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> కారణమాలాలంకారం



లక్షణం:
(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)
గుంభః కారణమాలా స్యాద్యథా ప్రాక్ప్రాంత కారణైః
నయేన శ్రీః శ్రియా త్యాగస్త్యాగేన విపులం యశః

(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
వరుస దప్పని కారణావళులతోడఁ
గీలు కొల్పినఁ గారణమాలయగును
నీతిచే సిరి సిరి చేత దాతృతయును
దాతృతను భూరియశమన్నరీతి శర్వ

భావం: కారణం కార్యం ఒకదానికొకటిగా చెప్పుకుంటూ పోతే అది కారణమాలాలంకారము. కారణం అంటే cause, కార్యం అంటే effect. ఒక కారణానికి కార్యం మఱొక కార్యానికి కారణంగా ఉంటే అది కారణమాల. ఉదాహరణకు, "నీతి చేత సంపద, సంపద చేత దానగుణం, దానగుణం వలన గొప్ప కీర్తి వస్తాయి" అన్నప్పుడు నీతి సంపదకు కారణం, సంపద దానగుణానికి కారణం, దానగుణం కీర్తికి కారణం. ఇది కారణ-మాల-అలంకారం.



(గ్రంథం: భగవద్గీత, రచన: కృష్ణ పరమాత్ముడు/వ్యాసభగవానుడు)
ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామో, కామాత్ క్రోధోభిజాయతే

క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి

భావం: మనిషి విషయాలను గురించి ఆలోచిస్తూ ఉండగా, తనకు వాటిపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి వలన కోఱిక జనిస్తుంది, కోఱిక వలన (అనుకున్నది దక్కకపోతే) కోపం, కోపం వలన సమ్మోహితుడౌతాడు, సమ్మోహం వలన ఆలోచనను కోల్పోతాడు, ఆలోచనను కోల్పోవడం వలన బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశించడం వలన నాశనమౌతాడు.



(చిత్రం: నాలుగు స్తంభాలాట, రచన: వేటూరి సుందరరామమూర్తి)
చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలైపోయి, కడలిగా పొంగు నీ ప్రేమ

వివరణ: ఇది సూటిగా కారణమాలాలంకారం కాకపోయినా చినుకు నదికి కారణం, నది వరదకు కారణం, వరద కడలి పొంగుకు కారణం గా చెప్పుకుంటూ పోవడం వలన ఇది కారణ మాలాలంకారం అని చెప్పుకోవచ్చును అని నా అభిప్రాయం.



(చిత్రం: నువ్వే కావాలి రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది,
కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది

వివరణ: ఈ పంక్తిలో పరిణామాలంకారం, కారణమాలాలంకారం కలిపి ఉన్నాయని నా అభిప్రాయం. "విశాలనయన ప్రసన్నమై నేత్రపద్మాలతో చూచినది" అన్నామనుకోండి, దాని శబ్దార్థం (literal meaning) ఆమె పద్మాలతో చూచింది అని. కానీ పద్మాలతో ఎవరైనా చూడగలరా? లేదు కదా! అందుచేత ఆమె కళ్ళే పద్మాలయ్యాయి అని వాస్తవార్థం (real meaning). ఇక్కడ "చినుకు పాటయ్యింది" అంటే చినుకు అక్షరాలగానో, రాగం గానో అయ్యింది అని కాదు. చినుకులు చేసే శబ్దం పాటలా వినబడింది (పరిణమించింది) అని. అలాగే పాట తాకిన నేల "చిలకలు వాలే చెట్టయ్యింది" అంటే "పాట చేసే సవ్వడి చిలకపలుకుల లాగా తీయగా ఉన్నాయి" అని భావం. ఇవన్నీ పరిణామలంకారమే. కాకపోతే ఇవి వరుసగా పేర్చుకుంటూ ఒకదానికి మఱొకటి కారణంగా చెప్పారు కవి. నింగి చినుకైంది, చినుకు పాటైంది, నేల చెట్టైంది.



కారణమాలాలంకారానికి మఱొక పద్ధతి ఉంది. అది చూద్దాము.

(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)
భవంతి నరకాః పాపాత్ పాపం దారిద్ర్యసంభవం
దారిద్ర్యం అప్రదానేన తస్మాత్ దానపరో భవ

(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
నరకములు పాపమునఁ జే
కుఱుఁబాపము లేమిచే నగును లేమి పరి
స్ఫురణం బీకుండుటచేఁ
బరఁగు నటులుగాన దానపరుఁడవు గమ్మ!

భావం: నరకములు పాపము చేత, పాపము లేమి చేత, లేమి దానమీయకుండుట చేత వచ్చును. కాబట్టి దానము చేయవలెను.

వివరణ: ఇందాకటి ఉదాహరణలలో కారణం వెనుక కార్యం, వెనుక మఱొక కార్యం అలాగ వచ్చాయి. ఈ ఉదాహరణలో కార్యం వెనుక కారణం వచ్చింది. ఇది కూడా కారణమాలాలంకారమే.




(గ్రంథం: భగవద్గీత రచన: కృష్ణపరమాత్ముడు/వ్యాసభగవానుడు)
అన్నాత్ భవతి భూతాని, పర్జన్యాత్ అన్న సంభవః
యజ్ఞాత్ భవతి పర్జన్యో, యజ్ఞః కర్మసముద్భవః

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షరసముద్భవం,
తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం

భావం: అన్నం నుణ్డి జీవులు వస్తున్నారు, అన్నం వర్షం నుండి వస్తోంది, వర్షం యజ్ఞం నుండి వస్తోంది, యజ్ఞం విధ్యుక్త కర్మల చేత వస్తోంది, కర్మలు వేదాలనుండి పుట్టాయి, వేదాలు బ్రహ్మం నుండి పుట్టాయి. అందుచేత సర్వత్రా ఉన్న బ్రహ్మ యజ్ఞంలో ప్రతిష్ఠింపబడినాడని గ్రహించు.

వివరణ: ఇదివరకు కోపం వలన సమ్మోహం, సమ్మోహం వలన స్మృతిభ్రంశం అంటుంటే ముందు భాగంలో  కార్యం (సమ్మోహం) తఱువాతి భాగంలో కారణం అవుతోంది. ఇప్పుడు జీవులు అన్నం వలన, అన్నం వర్షం వలన అంటుంటే ముందు భాగంలో కారణం (అన్నం) తఱువాతి భాగంలో కార్యం అవుతోంది. అంతే తేడా.



ఈ పద్ధతికి మఱొక ఉదాహరణ కాకపోయిన ఒక అచ్చు (blue-print) లాగా చెప్పవలసినది అందరికీ తెలిసిన ఏడు చేపల కథ.

అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురూ ఏటికి వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండ పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. “చేపా, చేపా, ఎందుకు ఎండలేదు?”  అని అడిగితే, “గడ్డిమోపు అడ్డం వచ్చింది” అని అంది చేప. “గడ్డిమోపూ గడ్డిమోపూ ఎందుకు అడ్డం వచ్చావు?” అని అడిగితే, “ఆవు  మేయలేదు” అని చెప్పింది గడ్డిమోపు.  “ఆవూ, ఆవూ గడ్డి ఎందుకు మేయలేదు?”  అని అడిగితే, “పశువుల కాపరి  విప్పలేదు” అంది. “పశువుల కాపరీ, ఆవును ఎందుకు విప్పలేదు?”  అని అడిగితే, “అమ్మ గారు అన్నం  పెట్టలేదు” అన్నాడు పశువుల కాపరి. “అమ్మ గారు అమ్మ గారు ఎందుకు అన్నం పెట్టలేదు?”  అని అడిగితే, “పాప  ఏడ్చింది” అంది. “పాప పాప ఎందుకు ఏడ్చావు?” అని అడిగితే, “చీమ కుట్టింది” అంది పాప. “చీమా చీమా ఎందుకు కుట్టావు?” అని అడిగితే, “నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?”

అంది చీమ. ఇక్కడ కూడా కార్యం ముందు తెలుస్తోంది, కారణం తఱువాత తెలుస్తోంది.

Friday, September 7, 2012

అలంకారాలు - చంద్రాలోకం

దాదాపు రెండేళ్ళ క్రితం అలంకారాల గురించి వ్రాయడం ఆరంభించాను. అసలు ఈ అలంకారాల గురించి ఎక్కడ చదువుతున్నాను, వీటి చరిత్ర ఏమిటి అనేది కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. ఈ వ్యాసం అందుకే.

భారతదేశంలో తరతరాలుగా కవులు అలంకారాలను గుర్తిస్తూ వాటి గురించి దీర్ఘవిశ్లేషణలతో పుస్తకాలు వ్రాస్తూ వచ్చారు. వీరు అలంకారాల గురించి చెప్పే శాస్త్రాన్ని అలంకారశాస్త్రం అన్నారు. మనకు దొరికిన ఆధారాల వరకు, వీరిలో ప్రథముడు భరతుడు (భరతముని అని కూడా అంటారు). ఈయన ఏ కాలంలో జీవించారు అనే దానికి క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 300 వరకు సమాధానాలు వినవస్తున్నాయి కానీ కచ్చితమైన నిర్ణయం ఇంకా లేదు. ఈయన "నాట్యశాస్త్రం" రచయితగా ప్రసిద్ధులు. ముఖ్యంగా ఈయన నటనలో రసాలను గుర్తించి వర్ణించారు. అది అటుంచితే, ఈయన 4 అలంకారాలను గుర్తించారు. ఈయన ప్రత్యేకత, ఆసక్తి నాట్యం పైన ఉండటంతో ఆ శాస్త్రాన్ని గురించి చెప్తూ అలంకారాల గురించి అంటీ-అంటనట్టుగానే కొంత వర్ణించారు. అవి ఏ అలంకారాలు అన్న ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు.

విష్ణుధర్మోత్తరపురాణంలో 18 అలంకారాలను వర్ణించారు. ఈ పురాణాన్ని అష్టాదశ ఉపపురాణాలలో చెప్పింది బృహద్ధర్మపురాణం. ఈ పురాణంలో పిపీలికాదిబ్రహ్మపర్యంతం అనేక విషయాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలుకొని సూర్యవంశం, చంద్రవంశం, యక్షులు, రాక్షసులు, పాతాళలోకం, పితృకర్మలు, వాస్తు, జ్యోతిషం, వేదాంతం, సంగీతం, సాహిత్యం అన్నిటి గురించీ 3 భాగాలలో, 1345 పర్వాలలో వర్ణింపబడ్డాయి. దీని రచయిత ఎవరు అనేది కచ్చితంగా తెలియదు కానీ ఇది భరతముని కాలం తఱువాతనే వ్రాసి ఉండాలి.

సుమారు క్రీ. శ. 6వ శతాబ్దం చిగురులో దండి అనే మహాకవి "కావ్యదర్శం" అనే గ్రంథంలో 38 అలంకారాలను గురించి వ్రాసారు. ఈయన రచించిన దశకుమారచరిత చాలా ప్రసిద్ధమైనది. "కావ్యదర్శం" పైన "భట్టికావ్యం" అనే రచన ప్రభావం చాలా ఉంది అని కొందరి అభిప్రాయం.

క్రీ.శ. 7వ శతాబ్దంలో లో భామహుడు "కావ్యాలంకారం" అనే గ్రంథం వ్రాసారు. ఇందులోని రెండు, మూడు అధ్యయాలలో అలంకారాల 35 గురించి చెప్పారు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే దండి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దండి వ్రాసిన దండి కావ్యదర్శాన్ని విమర్శించారు. సూటిగా ఫలాన ఆయన ఇలాగన్నాడు అని అనకుండా అపరే, అన్యే  (వేఱే వారు), కేచిత్ (కొంతమంది), అమేధసః (తెలివితక్కువ వాళ్ళు), కేచిత్ మహాత్మాః (కొందరు మహాత్ములు) వంటి సంబోధనలతో దండి రచనని విమర్శించారు. కాకపోతే కొన్ని చోట్ల పూర్తిగా ఏకీభవించారు కూడా.

దండి యమకం, అనుప్రాస అనే శబ్దాలంకారాలను అలంకారాలుగా గుర్తిస్తే భామహుడు వీటిని వేఱుగా శబ్దచిత్రాలు అన్నారు. వచనకవిత్వంలో కథ, ఆఖ్యానం అనేవి రెండుగా వర్ణించినా నిజానికి ఒకటేనని దండి చెప్తే, భామహుడు దాన్ని ఆక్షేపించారు. ఏది ఏమైనా, దండి భామహుడు సమకాలీనులైనా అవ్వాలి లేక దండి భామహుడి కంటే ముందు ఉండి ఉండాలి అని ఒక అభిప్రాయం. కొందరు అది తప్పంటారు.

ఉద్భాత అనే క్రీ.శ. 8వ శతాబ్దపు కాశ్మీర్ కవి భామహుడు కావ్యాలంకారానికి "భామహవివరణ" అనే పేరుతో దీనికి వ్యాఖ్యానం వ్రాసారు. ఆయన స్వయంగా "కావ్యాలంకార సంగ్రహం" పేరిట 41 అలంకారాలను వివరించారు. క్రీ.శ. 9వ శతాబ్దంలో రుద్రత అనే కాశ్మీరీ కవి "కావ్యాలంకారం" అనే పేరుతో వ్రాసిన పుస్తకం ప్రసిద్ధమైనది. ఇందులో 16 అధ్యాయాలలో సుమారు 700 శ్లోకాలలో 68 అలంకారాలను వర్ణించారు. 11వ శతాబ్దంలో మమ్మట అనే ఆయన "కావ్యప్రకాశం" లో 67 అలంకారాలను గుర్తించారు. 12 వ శతాబ్దంలో రుయ్యకుడు "అలంకారసర్వస్వం" లో 79 అలంకారాలను చెప్తే, వాగ్భాత 69టి ని సూచించారు. 13వ శతాబ్దంలో జయదేవుడు 100 అలంకారాలతో వ్రాసిన పుస్తకం "చంద్రాలోకం". దాన్నే ఆధరంగా నేను అలంకారాలను చెప్తున్నాను. ఆ తఱువాత 14 వ శతాబ్దంలో కలింగదేశపు విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో 84టిని గుర్తించారు. 16వ శతాబ్దంలో తమిళనాడులో జన్మించిన అప్పయ్యదీక్షితుడనే ఒక అద్వైత వేదాంతి "కువలయానందం" లో 124 అలంకారాలను గుర్తించారు.

ఇప్పటిదాక నేను చెప్పినది కేవలం భారతసాహిత్యగగనంలో ఎక్కువ వెలుగు కలిగిన తారలనే. వీరు కాక అనేకానేకులు కావ్యం ఎలాగ వ్రాస్తే రక్తి కడుతుంది అనే అంశం మీద పుంఖానుపుంఖాలు వ్రాసారు. ఇంత చరిత్ర కలిగిన మనం చివరకు అర్థం పర్థం లేని పిచ్చి మాటలను పాటలుగా పాడుకుంటున్నామంటే అది మన దోషమేనని చెప్పుకోవాలి.  ఇక చంద్రాలోకం గురించి చెప్పుకుందాము.

చంద్రాలోకం రచించిన జయదేవుడు, గీతగోవిందం రచించిన జయదేవుడూ ఒకరే అని కొంతమంది వాదన. ఇద్దరూ దాదాపు 12 లేక 13 వ శతాబ్దానికి చెందిన వారే. ఇద్దరూ సంస్కృత పండితులే. ఇద్దరూ ఒరిస్సా నుండి వచ్చినవారే. ఇంత సామ్యం ఉన్నా వారు ఒక్కరే అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గీతగోవిందంలోని పాటల్లో జయదేవుడు తాను భోజదేవుడు, వామదేవీ ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. పైగా ఆయన పరమవైష్ణవుడు. (గీతగోవిందమంతా శ్రీకృష్ణప్రేమామృతమే కదా!) కానీ చంద్రాలోకం రచయిత జయదేవుడు తాను రచించిన "ప్రసన్న రాఘవం" అనే నాటకంలో మహదేవుడు, సుమిత్రా ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. ఈ నాటక శివుడికి సంబంధించిన పండుగ సందర్భంగా మొదట నటింపబడింది అని చెప్పాడు. అప్పట్లో వైష్ణవులకు, శైవులకు ఉన్న పోటీని బట్టి చూస్తే గీతగోవిందం రచయిత ఈతడు అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

చంద్రాలోకాన్ని తెలుగులోకి ఆడిదము సూరకవి అనువదించాడు. ఈయన 18వ శతాబ్దం చివరి భాగానికి చెందిన వాడు. ఆంధ్రనామశెషము, కవిజనరంజనము, రామలింగేశ శతకం వీరి ఇతరరచనలు. సంస్కృత చంద్రాలోకంలో ఒక్కో అలంకారం ఒక్కో శ్లోకంలో వివరింపబడి ఉంది. శ్లోకంలో మొదటి పంక్తి అలంకారం లక్షణాన్ని వివరిస్తే రెండవ పంక్తి ఒక ఉదాహరణను చెప్తుంది.  ఆంధ్ర చంద్రాలోకంలో సూరకవి కూడా అదే శైలిని అవలంబించారు. సంస్కృతశ్లోకాలను ఒకటికి ఒకటిగా తెనిగించారు. తెలుగులో అన్నీ గీతాపద్యాలయ్యాయి. దీని గురించి చాలా మంది వ్యాఖ్యానాలు వ్రాస్తూ వచ్చారు. వీటిలో అక్కిరాజు ఉమాకాంతవిద్యాశేఖరులు, పరవస్తు వేంకటరంగాచార్యులు వ్రాసిన వ్యాఖ్యానాలను ఆధారంగా డా. బులుసు వెంకటసత్యనారాయణ మూర్తి గారు వ్రాసిన పుస్తకం చదువుతూ నేను అలంకారాలను వివరిస్తున్నాను.

Monday, September 3, 2012

హేత్వలంకారము


వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> హేత్వలంకారం


లక్షణం:

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం నుండి)
హేతోర్హేతుమతా సార్థం వర్ణనం హేతురుచ్యతే
అసావుదేతి శీతాంశుర్మానభేదాయ సుభ్రువాం ||

అనువాదం: (ఆడిదము సూరకవి రచించిన తెలుగు అనువాదం నుండి)
కార్యకారణములు రెండు గలియఁబలికె
నేని యది హేత్వలంకృతి నా నెసంగు
నుదయ మందెడు నీ శశి మదవతీ క
దంబమానముల్విచ్చు చెయ్దంబు కొఱకు

వివరణ: హేతువు అంటే కారణం. హేతుమంతం అంటే కార్యం. ఉదాహరణకు సూర్యుడు రావడం హేతువు, పద్మాలు విచ్చుకోవడం కార్యం. హేతువు, హేతుమంతం ఒకే వాక్యంలో చెప్తే అది హేత్వలంకారం (హేతు + అలంకారం) అవుతుంది.

సూర్యుడు ఉదయించడం వలన జరిగే కార్యాలేమిటి? చెట్లు వికసించడం, సముద్రంలోని నీళ్ళు ఆవిరవ్వడం మొదలుకొని ఒడియాలు ఆరడం వరకు అనేకఫలితాలు ఉన్నాయి. కానీ, సూర్యుడు ఉదయించినది కేవలం పద్మాలు విచ్చుకోవడం కోసమేనన్నామనుకోండి, మిగతావి అంత ముఖ్యమైనవి కావు, పద్మాలు వికసించడమే అసలు విషయం అనే ధ్వని వచ్చి పద్మాలను పొగిడినట్టు అవుతుంది. అదే హేత్వలంకారం.

పై శ్లోకంలో (అనువాదంలోనూ) రెండొ భాగంలో కవి ఒక ఉదాహరణ ఇచ్చాడు. "ఈ అందమైన భామల అలుక తీర్చడానికే చంద్రుడు ఉదయిస్తున్నాడు" అని ఆ వాక్యం భావం. నిజానికి చంద్రుడు రావడం వలన అనేకకార్యాలు జరుగుతాయి. మచ్చుకు కలువలు విచ్చుకుంటాయి. కానీ కవి వాటన్నిటినీ త్రోసిపుచ్చి అలిగిన అమ్మాయిలు అలుక వీడి ప్రియులకు లొంగడానికే వచ్చాడు అంటున్నాడు.


హేత్వలంకారం మఱొక లాగా కూడా సమకూరచ్చును. దానికి కవి ఇచ్చిన లక్షణం, ఉదాహరణ చూద్దాము.

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం)
హేతు హేతుమతోరైక్యం హేతుం కేచిత్ ప్రచక్షతే
లక్ష్మీ విలాస విదుషాం కటాక్షా వేంకట ప్రభోః

అనువాదం: (ఆడిదము సూరకవి)
కార్యకారణములకు నైక్యమగునేనిఁ
గృతులఁ గొందఱు హేత్వలంకృతియ యండ్రు
సత్కవులకున్ రమావిలాసములు వేంక
టేశ్వర కటాక్షము లనంగ నిందు మౌళి

వివరణ: కొంతమంది హేతువు, హేతుమంతం ఒకటేనని చెప్పడం హేత్వలంకారం అంటారు. ఉదాహరణకు "సత్కవులకు లభించే సిరిసంపదలు శ్రీ వేంకటేశ్వరుని కటాక్షం" అన్నామనుకోండి. నిజానికి వెంకటేశ్వరుని అనుగ్రహం "వలన" మనకు సిరిసంపదలు లభిస్తాయి అని ఉద్దేశం. కానీ, ఆ "వలన" అనే పదం విడిచిపెట్టేసి రెండిటికీ అభేదం చెప్తున్నాము. ఇదీ హేత్వలంకారమే.


ఈ అలంకారం చాలా తెలుగు పాటలలో విన్న గుర్తు. గుర్తుకు వచ్చినప్పుడు అవీ కలుపుతాను. ఈ లోపల చదువర్లకు ఏమైనా ఉదాహరణలు తెలిస్తే చెప్పగలరు.

Sunday, September 2, 2012

రాంబాబు కథలు - అసలు కంటే వడ్డీ ముద్దు

ఒక రోజు పొద్దున్నే రాంబాబు & కో మధ్య సంభాషణలు.

వెం: ఆకలేస్తోందిరా. ఏమైనా తినడానికి ఉందా?
రాం: వెళ్ళి వంటింట్లో వెతుక్కో.
వెం: ఇక్కడ biscuit packet ఉంది? ఎప్పటిది?
రాం: అది తినకు, ఎప్పుడో పరమపదించింది.
వెం: (packet పై label చదువుతూ) ఇది September 1st న manufacture ఐందిరా. Best before 2 weeks of manufacture. ఫరవాలేదు.

(వెంకట్ packet తెరిచి ఒక biscuit ముక్క తిన్నాడు. తింటూనే గొంతులో మండినట్టైంది, ఒక రకమైన చేదు నాలికని ముంచేసింది.)

వెం: యక్క్...ఏమిటిరా ఇది? ఇంత దారుణంగా ఉంది?
రాం: బ్రహ్మచారుల ఇళ్ళలో manufacture date చూసినప్పుడు year కూడా చూసుకుంటూ ఉండాలి బాబు. నేను ముందే చెప్పాను. అందుకే...మంచి మనిషికొక మాట, మంచి కుక్కకొక biscuit అన్నారు. నీకు మాట పని చెయ్యలేదు కానీ biscuit పని చేసింది.

(ఇంతలో వెంకట్ లేచాడు.)

చం: Good Morning
రాం: ఆ నీకు శుభోదయం, వీడికి అశుభోదరం.

(చందు phone మ్రోగింది. phone ఎత్తాడు.)

చం: ఏంటి పెద్దమ్మ, ఎలాగున్నావు?
...
చం: ఆవేశపడకు, అసలేం జరిగిందో చెప్పు.
...
చం: నేను అన్నయ్యలతో మాట్లాడతానులే.


(చందు phone cut చేసి, వేఱొక number నొక్కి మాట్లాడసాగాడు).


చం: ఆ, అన్నయ్య. ఇప్పుడే పెద్దమ్మ phone చేసింది. అసలు విషయమేమిటి?
...

(చందు వేఱే గదిలోకి వెళ్ళి చాలా సేపటికి phone పెట్టేసి బయటకు వచ్చాడు. రాంబాబు, వెంకట్ ఏమైందా అని కంగారు పడ్డారు.)


వెం: ఏరా, ఏమైంది?

(దానికి చందు పకలబడి ఒక ఐదు నిముషాల పాటు నవ్వాడు. వెంకట్, రాంబాబులకు ఏమీ అర్థం కాలేదు. విషయం ఏమిటో చెప్పమన్నా చెప్పట్లేదు.)

వెం: అన్నట్టు ఇందాక మా danger బాబాయ్ phone చేసాడు రా. పిసినారు మాష్టారు గారి అమ్మాయి నాకు వద్దని చెప్పేసాను కదా, నాకు తెలిసిన software engineer లు ఎవరైనా ఉంటే సంబంధం చెప్పమన్నాడు. నీ పేరు ప్రతిపాదిస్తున్నాను.

(చందు ముఖం ఉన్నట్టుండి ఎఱ్ఱగా అయిపోయింది.)

చం: రేయ్, ఎంత పని చేసావు రా? నిన్ను friend అని ఆదరించినందుకు నాకు
...
వెం: వోల్డేయ్! అదేమీ జరగలేదు. ఇప్పుడు చెప్పు -- అసలా phone లు ఏంటి, నీ నవ్వేమిటి?
చం: "అసలు కంటే వడ్డీ ముద్దు" అనే సామెత మనవల గురించి చెప్తూ ఉంటారు కదా?
రాం, వెం: ఊఁ
చం: ఇప్పుడు మన bank లకు మల్లే వడ్డీలు ఆట్టే బాగుండట్లేదు. మా పెద్దమ్మ మనవలు, మనవరాళ్ళు ఆవిడకు నచ్చట్లేదు. అదే గగ్గోలు పెడుతోంది.
రాం: ఇంకొంచెం వివరింపుము.
చం: మా పెద్దమ్మకు నలుగురు కొడుకులు. నలుగురూ నాలుగు ఊళ్ళల్లో ఉన్నారు. ఆవిడకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడకు వెళ్ళి వస్తూ ఉంటుంది. కొడుకులందరూ ఆవిణ్ణి బాగా చూసుకుంటారు. ఈ మధ్యన మా పెద్దమ్మ హైదరాబాదులో ఉన్న రెండో కొడుకు ఇంటికి వెళ్ళింది. అదే సుందరన్నయ్య అని చెప్తాను అతను. సుందరన్నయ్య కి పదేళ్ళ కూతురుంది. దాని పేరు  సౌమ్య.

ఒక రోజు తఱగతిలో అందరూ తమ తమ తాత గురించి చెప్పుకుంటున్నారు. సౌమ్య ఏమో అసలు మా పెదనాన్నను చూడనే లేదు. అది పుట్టక మునుపే ఆయన కాలం చేసారు. కానీ తోటి పిల్లల మాటలు విని ఈమెకు బాధేసింది. చాలా ఉక్రోషంతో ఇంటికి వచ్చి అన్నయ్యతో "నాన్న, నువ్వు తాతను నాకు ఎందుకు చూపించలేదు?", అని నిలదీసింది. వాళ్ళ తను నవ్వుతూ, "నువ్వు పుట్టక ముందే తాతగారు చనిపోయారమ్మా",  అన్నాడు. ఆమె ముఖం దిగులుగా మారిపోయింది. కాస్త ఉత్సాహపరుద్దామని, "బాధపడకమ్మా, నువ్వే మా నాన్నవి, తాతే మళ్ళీ నువ్వై పుట్టావు", అన్నాడు. అదే అన్నయ్య చేసిన పాపం. వెంటనే సౌమ్య చెలరేగిపోయింది. వాళ్ళ అమ్మను, నాన్నను పేరు పెట్టి పిలవడం మొదలెట్టేసింది. తిడితే ఏడుస్తుంది అని ఊరుకున్నారు.

అది జరిగిన వారానికి మా పెద్దమ్మ పెద్దన్నయ్య ఇంటినుండి సుందరన్నయ్య దగ్గరకు వచ్చింది. ఆవిడ వస్తూనే సౌమ్య ఆవిణ్ణి పేరుతో పిలిచి, "కాస్త కాఫీ పట్రా" అంది. పెద్దమ్మ నివ్వెరపోయింది. "ఏఁవిటే గుంట, నీ ఆగడం", అంది. దానికి "ఇదిగో, నన్ను గుంట, తుంట అన్నావంటే దెబ్బలు పడతాయి. నన్ను ఏఁవండీ అని పిలవాలి" అంది. పెద్దమ్మకు ఇంకా ఏమీ అర్థం కాలేదు. ఇంతలో అన్నయ్య వచ్చి జరిగిన విషయం చెప్పి, "అమ్మా, రెండు రోజులు ఊరుకుంటే విషయం సర్దుమణుగుతుందిలేవే", అన్నాడు.

అక్కడితో కథ ముగిసింది అనుకున్నాడు కానీ అసలు సంగతి మరిచిపోయాడు. మా పెదనాన్న form లో ఉండగా మా పెద్దమ్మను బాగా ఇబ్బంది పెట్టాడు. అందుకని మా పెద్దమ్మకు ఆయనంటే గొప్ప చిఱాకు. సౌమ్యకు మా పెదనాన్న పోలికలు కొన్ని వచ్చాయి. వెరసి, చంద్రముఖి రజినీకాంత్ నే రాజు అనుకున్నట్టు మా పెద్దమ్మ నిజంగానే సౌమ్య మా పెదనాన్న అని sub-conscious గా ముద్ర వేసేసుకుంది.  పెదనాన్న మీద ఉన్న కక్షంతా ఈ చిన్నపిల్ల మీద చూపించడం మొదలెట్టింది. అది తాగే పాలలో నీళ్ళు ఎక్కువ కలిపేయడం, కోడలు అడిగితే "చిక్కటి పాలు తాగితే అజీర్తి చేస్తుంది", అనడం. అన్నంలో పెరుగనేసరికి  చకచకా మజ్జిగ గిలక్కొట్టేయడం, కోడలు అడిగితే "మజ్జిగ అరుగుదలకు మంచిది", అనడం.  పాప పడుకుంటే fan కట్టేయడం, కోడలడిగితే బుగ్గలు నొక్కుకుంటూ, "ఓసినీ, అంత పెద్ద మంచం మీద పిట్టంత ఉంటే దిండనుకున్నాను", అనడం. చదువు చెప్తాను అని పద్నాల్గు పన్నెండ్లగడం -- చెప్పకపోతే మొట్టేసి, "నీకు దెబ్బలు పడాలి", అనడం. ఒక రోజు ఏం జరిగిందంటే...

<ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్...>

పెద్దమ్మ: ఈ రోజు నక్షత్రం ప్రకారం మీ నాన్న గారి పుట్టినరోజు రా అబ్బాయ్, ఈ చంటిదానికి తలంటు పోసుకుని సంతోషించనివ్వరా.

(వదిన వద్దు అని చెప్పమని అన్నయ్యకు సైగ చేసింది, కానీ అప్పటికే అన్నయ్య కళ్ళల్లో నీళ్ళు municipality గొట్టంలో లాగా చుక్కలు చుక్కలుగా కారుతున్నాయి. గొంతైతే ఆ కుళాయిలో నీళ్ళొచ్చే ముందు లాగా గాలి వస్తోంది
కానీ మాట రావట్లేదు. అప్పటికీ మా వదిన ఆపుదామని ప్రయత్నించింది.)


వదిన: అత్తయ్య గారు, ఎవరైనా English calendar ప్రకారం చేసుకుంటారు, లేకపోతే తిథుల ప్రకారం చేసుకుంటారు, నక్షత్రాల ప్రకారం ఏమిటండి? పైగా ఇది అధిక మాసం కూడాను!
పెద్దమ్మ: నెల తక్కువ వాళ్ళకు అధికమాసంలోనే పుట్టినరోజు చేస్తారని మీ మావయ్య గారు ఎప్పుడూ అధికమాసంలోనే చేసుకుంటూ ఉండేవారులే తల్లీ. ఐనా మా వైపు ఆచారాలు నీకు తెలియవు.
వదిన: అమ్మాయికి జలుబుగా ఉందండి. ఇప్పుడు ఎందుకు?
పెద్దమ్మ: అంతేలే అమ్మా, ఎంతైనా కూతురు లేదనే కదా నీకు నేనంటే లోకువ? మీ మావగారు నాతో ఎన్ని అబద్ధాలు చెప్పినా అదేమిటో మాయదారి దేవుడు ఒక్క ఆడ నలుసును కూడా ఇవ్వలేదు.

(అంటూ కంట తడి పెట్టుకుంది. ఇది చూసి ఓర్చుకోలేక మా అన్నయ్య...)

అన్నయ్య: అమ్మా, నువ్వు సౌమ్యకు స్నానం చేయించాలి. అలా చేయిస్తేనే నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది.

(పది నిముషాలు తిరిగేసరికి సౌమ్య కళ్ళు మంట, జుట్టంతా చిక్కులు. ఆరున్నర శ్రుతిలో ఏడుస్తుంటే వదిన అన్నయ్య దగ్గరకు తీసుకొచ్చి...)

వదిన: మీ నాన్న గారు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. కాస్త ఓర్దార్చండి.

(అన్నయ్య వదిన దగ్గర తువ్వాలు తీసుకుని సౌమ్యని దగ్గరకు తీసుకుని ఆ తువ్వాలు తలపై వేసి చెవులు నొక్కి పట్టుకుని...)

అన్నయ్య: పిచ్చి మొహమా...మా నాన్న సౌమ్య అవ్వడం ఏమిటే వెఱ్ఱిబాగుల్దానా. నువ్వు దీన్ని ఎనిమిదో నెల కడుపుతో ఉండగా మా నాన్న స్వర్గస్థులయ్యారు. అప్పటికే ఇది నీ కడుపులో comfortable గా దొర్లుతూ ఉండటం నా కళ్ళతో sonogram లో చూసాను. కి..కి..కి. నేను అబద్ధం ఆడితే నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్న నీకే
తెలియలేదు. అలాగ ఉండాలి అబద్ధం అంటే...
వదిన: అవునా...మరి మీ నాన్న గారి నక్షత్ర-పుట్టినరోజుకు దీనికి తలంటు పోస్తానంటే ఎందుకు ఒప్పుకున్నట్టో? మీ అబద్ధాలు మిమ్మల్ని కూడా నమ్మించేస్తున్నాయి కాబోలు.

(అన్నయ్య తెల్లబోయి చూస్తూ ఉండగా సౌమ్య శ్రుతి పెంచి ఏడవడం మొదలెట్టింది...)

సౌమ్య: నాన్న -- నాకు వినబడటం లేదు. నా చెవులకు ఏదో ఐంది...
అన్నయ్య: బంగారం, ఏఁవీ కాలేదు నాన్న, ఆగు.

(అంటూ తల తుడవడం మొదలెట్టాడు. ఇంతలో పెద్దమ్మ గది బయటనుండి...)

పెద్దమ్మ: ఒరేయ్ నాన్న, మీ నాన్న గారికి ఇష్టమని జీడిపప్పు గారెలు చేసాను రా. అల్లప్పచ్చడి కూడాను.
వదిన: జీడిపప్పు గారెలా? అదేమిటండి?
అన్నయ్య: మా అమ్మకు గారెలంటే పిచ్చి, మా నాన్నకు మందులో నంజుకోవడానికి వేయించిన జీడిపప్పు అంటే ఇష్టం. పుణ్యం పురుషార్థం కలిసొస్తాయని మా అమ్మ ఈ కొత్త వంటకం కనిపెట్టింది. మా గొప్ప రుచిగా ఉంటుంది అనుకో. ఇప్పటికీ మా నాన్నకు తద్దినం పెట్టడానికి వచ్చిన బ్రాహ్మలు "మీ చేత్తో వడ్డించిన గారెలే గారెలండి!" అంటూ ఉంటారు.
పెద్దమ్మ: ఏరా, వస్తున్నారా?

(భోజనాల బల్లమీద అందరూ కూర్చుంటుంటే)

పెద్దమ్మ: అమ్మాయ్, నువ్వు నేను తఱువాత కూర్చుందాము. అదేమిటో వడ్డిస్తూ తిన్నా, ఒక్కదానినీ తిన్నా నాకు వంటపట్టదు.

(వదిన అమాయకంగా తల ఊపుతూ లేచింది).

అన్నయ్య (లొట్టలేస్తూ): అబ్బా, గొప్ప కారంగా కుదిరాయే. సెగొచ్చేస్తోంది నోట్లోంచి.


(ఇంతలో సౌమ్య మళ్ళీ ఏడవడం మొదలెట్టింది...)

అన్నయ్య: ఏమైంది బంగారం?
వదిన: మీ బంగారానికి కారమెక్కువైంది. ఆగండి, పంచదార తెస్తాను.
పెద్దమ్మ (సౌమ్యతో): అదేమిటండి? ఒకప్పుడు ఇవి లొట్టలేసుకుంటూ తినేవారు. ఇప్పుడెందుకు కారమంటున్నరు?
వదిన: ఆఁ, అప్పట్లో పక్కన తీర్థముండేది. ఇప్పుడు ప్రసాదం ఒక్కటీ తింటుంటే ఎక్కట్లేదు.

(అన్నయ్య, సౌమ్య తిని లేచి వేఱే గదిలో కూర్చున్నారు)

అన్నయ్య: బంగారం, నీకొక surprise.
సౌమ్య: నాకు surprise వద్దు. బామ్మతో sorry చెప్పించు. నాకు కోపం తెప్పిస్తోంది.
అన్నయ్య: బామ్మ మనందరి కంటే పెద్దది కదా, sorry చెప్పకూడదు. అందుకే నీకు chocolate తెచ్చాను. ఇదిగో!

(సౌమ్య ఒక చేత్తో chocolate తీసుకుని, మఱొక చెయ్యి చాపింది. అన్నయ్య చెయ్యి తట్టబోతే, చెయ్యి పక్కకు జరిపి మళ్ళీ చాపింది...)

అన్నయ్య: chocolate ఇచ్చాను కదా?
సౌమ్య: రెండు కావాలి.
అన్నయ్య: అమ్మ మీద నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకటే కదా ఇచ్చేది?
సౌమ్య: అది మా అమ్మ కోపం తెప్పిస్తే. ఇప్పుడు మీ అమ్మ కోపం తెప్పిస్తోంది.

(అన్నయ్య నివ్వెరపోయి రెండొ chocolate ఇచ్చాడు. వెంటనే పక్కనే ఇంకో చెయ్యి చాపి ఉంది. చూస్తే అది మా వదినది.)

వదిన: నాకోటి ఇవ్వండి.
అన్నయ్య: ఎందుకు?
వదిన: ఆఁ, మీ అమ్మ గారు నాకూ కోపం తెప్పించారు.
అన్నయ్య: అబ్బా, ఆశ, దోస...సౌమ్యకు, నీకూ ఒకందుకే కోపం వచ్చింది. నాకు మాత్రం మూడు chocolateలు ఖర్చా?
వదిన: నాకు వేఱేగా కోపం తెప్పించారు.

(అన్నయ్య ముఖంలో ప్రశ్నార్థకం చూసి వీళ్ళు వచ్చేసిన తఱువాత భోజనాల బల్ల దగ్గర జరిగిన విషయం చెప్పింది...)


<ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్...>

పెద్దమ్మ: అమ్మాయ్, కూర్చో వడ్డించుకుందాము. ఇప్పటికే పదకొండైంది. మళ్ళీ నువ్వు మధ్యాహ్నానికో రెండు పప్పు గింజలు, నాలుగు బియ్యపు గింజలూ cooker లో పడేసి, కాసిని కూర ముక్కలు వేయించాలి, ఇంత చారో పులుసో కాయాలి. నేనూ రెండు గారెలు తిని కాస్త సాయం చేస్తాను. ఎలాగా నూనె పొయ్యి మీదనే ఉంది కాబట్టి అప్పడాలూ, ఒడియాలూ వేయిస్తాను.
వదిన: అలాగేనండి
పెద్దమ్మ:  అన్నట్టు పొద్దున్న వెంకటేశ్వర స్వామికి కొట్టిన కొబ్బరికాయ పచ్చడి చేసేయమ్మాయ్, లెకపోతే పాడైపోతుంది. అన్నట్టు ఈవేళ శనివారం కదా. రాత్రి నేను tiffin ఏ తింటాను. అందులో ఈ పచ్చడి నంజుంకుని తింటే సరిపోతుంది.
వదిన: అలాగేనండి. రాత్రి మీకు వేఱుగా కాస్త ఉప్పుపిండి వండుతాను.
పెద్దమ్మ: అదేమిటమ్మాయి? నాకేమైనా చక్కెరవ్యాధా, గుండెపోటా? పెసలు నానబోసి చక్కగా నాలుగు పెసరట్లు పొయ్యి. సన్నగా తరిగిన మిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు కూడా దట్టించావనుకో ఆ రుచే వేఱు.

(వింటూనే వదినకి తల తిరిగింది. పెద్దమ్మ రెండంటే రెండే గారెలు తీసి వదిన పళ్ళెంలో వేసింది. వదిన ఆశ్చర్యంగా చూస్తూ...)

వదిన: అదేమిటండి మీరు పదహారు గారెలుకు కదా పిండి కలిపింది?
పెద్దమ్మ: అవునమ్మాయ్, రుచి కోసమని ఓ నాలుగు నోట్లో పడేసుకున్నాను. అదేమిటో ఉప్పు తక్కువైంది అని, కారం తక్కువైంది అని, రెండూ సరిపోతే జీడిపప్పు చాలక, అన్ని సార్లు రుచి చూడాల్సొచ్చింది. అది కాక అబ్బాయ్ ఒక అరడజను తిన్నాడు. వెఱ్ఱి నాగన్న! మంచి తిండి తిని చాలా రోజులైనట్టుంది. గుంటది రెండు తింది, మిగిలిన నాలుగూ నీకు రెండు, నాకు రెండు వేసాను. నీకు చాలకపోతే చెప్పు, ఒక సగం గారె అటేస్తాను.

వదిన: వద్దులేండి.

<ట్రుంగ్...ట్రుంగ్...ట్రుంగ్...>

వదిన: అది కూడా సహించానండి. కాకపోతే తింటున్నంత సేపూ మీ నాన్న గారి వలన ఆవిడ అనుభవించిన కష్టాలన్నీ చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. పోయినాయన్ని పట్టుకుని, "అసలు మనిషేనా", అని అడుగుతుంటే అవుననాలో కాదనాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యాను. పోనీ తింటున్నట్టు నటిద్దామా అంటే ఆ రెండు గారెలు ఎంత గిల్లుకొని తిన్నా అరగంట తినగలనా?

(ఈ కంగారు తట్టుకోలేక మా అన్నయ్య ఇక నిజం చెప్పేద్దామనుకున్నాడు. ధైర్యం చిక్కబుచ్చుకుని, పెద్దమ్మకు ఎదురుబడ్డాడు.)

అన్నయ్య: అమ్మా, నేను నీకొక నిజం చెప్పాలి. అది విని నువ్వు నన్ను తిట్టకూడదు, నువ్వు బాధపడకూడదు.
పెద్దమ్మ: మీ నాన్న నిజం దాచి ముప్పు తెచ్చారు, నువ్వు నిజం ఎంత చేదైనది ఐనా సరే, చెప్పరా.
అన్నయ్య: నేనేదో దాన్ని ఊరడించడానికి అలాగ చెప్పానే కానీ అది నాన్న కాదమ్మా.
పెద్దమ్మ: అవునా?
అన్నయ్య: అవునమ్మ.
పెద్దమ్మ: కాదురా, ఇదే మీ నాన్న అని నా అనుమానం. ఆయన కూడా ఇంతే తలంటితే చాలు గుక్కపెట్టి ఏదుస్తూ ఉండేవారు.

అన్నయ్య: అమ్మా, అలాగైతే అన్నయ్య, నేను, తమ్ముళ్ళిద్దరూ కూడా ఏడ్చేవాళ్ళం. అంత మాత్రాన అందరం నాన్నలమైపోతే ఇది జీవితం కాదు అమ్మ, దశావతారం cinema అవుతుంది. ఐనా మగవాడు జన్మాంతరంలో ఆడదానిగా ఎలాగ పుడతాడే?
పెద్దమ్మ: అవునురోయ్!
అన్నయ్య: నిన్న నాన్న నాకు కలలో వచ్చి 'ఒరేయ్ అబ్బాయ్, నువ్వు పొరబడ్డావు.  నేను నీ కడుపున పుట్టలేదు. నీ తమ్ముడు జానకిరాం ఇంట్లో పుట్టానూ' అన్నారే.

(ఆకలిగా ఉండి పాలు తాగుతున్న వదినకి ఈ మాట వింటూనే పొలమారింది...)

పెద్దమ్మ: అవునా! నిజమేలే ఆ వెధవ నాతో మాట్లాడడు కానీ పనిమనిషితో చొంగ కారుస్తూ వాగుతూ ఉంటాడు.
అన్నయ్య: పోనీలేవే అమ్మా, వాడికి ఇంకా ఇప్పుడే మూడో ఏడు వచ్చింది. ఇంకో ఏడాదిలో చొంగ కార్చడం ఆపేస్తాడు. మాటలంటావు...ఆ వచ్చిన అత్త, అమ్మ, న్యాన, అక్క ఎన్ని సార్లు అంటే మాత్రం ఏమౌతుందిలే. ఇంకో రెండేళ్ళాగితే బడిలో చేరిపిస్తారుగా. అప్పుడు మంచి-చెడూ తెలుస్తుంది.
పెద్దమ్మ: మీ బామ్మ కూడా మీ నాన్న గురించి అదే చెప్పింది, "ఉద్యోగం వచ్చి బయట తిరిగితే మంచి-చెడూ తెలుస్తుంది" అని. మీ నాన్నకు ఉన్న మంచి పోయి, చెడు మాత్రం బాగా అబ్బింది.
అన్నయ్య: అమ్మా, పోయినాయిన్ని ఎందుకు తలుచుకోవడం. ఊరుకోవే.
పెద్దమ్మ: అవును, ఇది మీ నాన్న కాకపోతే మరెవరు? కొంపదీసి మీ నాన్నమ్మ కాదు
కదా?

(ఎవరని చెప్తే ఏం తగులుకుంటుందో అని...)

అన్నయ్య: అబ్బె, కాదులేవే. ఇది ఎవరో - అసలు మనకు సంబంధం లేదు.

(ఇంతలో ఆ గదిలోకి నడుచుకుంటూ వచ్చింది సౌమ్య...)

సౌమ్య: నాన్న, నేను ఎవరు నాన్న. నువ్వు మా నాన్నవు కావా? మా class లో అందైర్కీ నువ్వే మా daddy అని చెప్పాను.

మళ్ళీ సౌమ్యకి అనుమానాలన్నీ తీర్చి మామూలు మనిషిని చెయ్యడానికి ఆరు five-star chocolate barలు అవసరమయ్యాయి.

<ట్రుంగ్ ట్రుంగ్ ట్రుంగ్...>

రాం: అంతేలే...పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కష్టాలు వస్తే bar ఏ కదా దిక్కు...ప్చ్...
చం: అదీ కథ. అసలు తాతను చూడలేదు అంటూ మొదలైన కథ చివరకు, తండ్రి తనేనని ఒప్పించాల్సిన పరిస్థితికి వచ్చింది.
వెం: మఱి ఆ తఱువాత ఏమైంది?
చం: హ్మ్....తఱువాత...తఱువాతేమౌతుంది? పెద్దమ్మ బెంగళూరు వచ్చింది...
రాం: హే, మాయ ఓ మాయ...ఈ life అంటే మాయ...
చం: వెటకారం వద్దు. ఇప్పుడు సమస్య కొత్త మలుపు తిరిగింది.
వెం: ఏమైంది? కొంపదీసి ఆవిడ ఇప్పుదు మన ఇంటికి వస్తున్నారా?

బెంగుళూరులో మా మూడో అన్నయ్య జానకిరాం ఉన్నాడు. వాడి ఇంటికి వచ్చింది. వాడి రెండేళ్ళ కొడుకు ఏం చేసినా అది మా పెదనాన్న అలవాటేనని అంటోందిట. అది సరే, ఈ రోజు వాడు మా సుందర్ అన్నయ్యతో మాట్లాడదామని skype call చేసాడట. అప్పుడు మఱొక నాటకం జరిగింది.

<ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్...>

జానకిరాం: ఒరేయ్ అన్నయ్య, అమ్మతో మాట్లాడతావని చేసాను రా. సౌమ్య ఏది?
సుందర్: అమ్మా, సౌమ్యా రా -- నాన్నమ్మతో మాట్లాడుదుగాని...
సౌమ్య: మరి chocolate ఇస్తావా?
సుందర్ (గొంతు సవరించుకుంటూ): అలాగే.
సౌమ్య (video chat లోకి వచ్చి): నాన్నమ్మ, నన్ను "fourteen twelves are" అడుగు?
పెద్దమ్మ: ఆ అడిగాను, చెప్పు.
సౌమ్య: నాకు తెలియదు. మా text book లో లేదు.

(ఎవ్వరికీ అర్థం కాక చూస్తున్నారు...)

సౌమ్య: దెబ్బలు పడతాయా? హ హ...computer లోంచి కొట్టలేవుగా...

<ట్రుంగ్...ట్రుంగ్...ట్రుంగ్...>

చం: అది విని మా పెద్దమ్మకు మళ్ళీ అనుమానం పట్టుకుంది, సౌమ్యే మా పెదనాన్నేమోనని. అందుకే ఇంత పొద్దున్నే నాకు phone చేసి నాకేమనిపిస్తోందో అడిగింది. అది సంగతి.

Saturday, September 1, 2012

వ్యతిరేకాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యతిరేకాలంకారం


లక్షణం: వ్యతిరేకో విశేషః చేత్ ఉపమేయ ఉపమానయోః

వివరణ: ఉపమేయం, ఉపమానం ఈ రెంటిలో ఏదో ఒకదానిలోనున్న ప్రత్యేకమైన విశేషం చెప్తే అది వ్యతిరేకాలంకారం అవుతుంది. ఆ విషయం ఉపమేయాన్ని పొగిడే విధంగా ఉండటం సహజం. చంద్రాలోకంలో ఇచ్చిన ఉదాహరణ చూద్దాము.


ఉదా:- (చంద్రాలోకం)
సంస్కృత శ్లోకం: శైలా ఇవోన్నతాస్సంతః  కింతు ప్రకృతి కోమలాః
భావం: (మీరు) కొండలవలే ఎత్తుగానున్న వారు కాకపోతే మీకు కోమలత్వం కూడా ఉంది.
వివరణ: కొండలకు, ఒక వ్యక్తికి సామ్యం చెప్పారు (ఎత్తుగా ఉండటం). కాకపోతే వెంటనే కొండలకు లేని, ఆ వ్యక్తికి ఉన్న ఒక విశేషాన్ని చెప్పారు -- సహజ కోమలత్వం. కనుక కొండలకంటే ఆ వ్యక్తే మెరుగు అని తెలుస్తోంది. ఈ వ్యతిరేక విషయం చెప్పడం వలన ఆ వ్యక్తిని మరింత పొగిడినట్టైంది. కనుక ఇది వ్యతిరేకాలంకారం.


ఉదా:- (కావ్యం: భామినీ విలాసం, రచన: జగన్నాథ పండితరాయలు)
పంక్తి:
ఓ ప్రియా, ఇలాటి నీ ముఖముతో రాత్రులందు ముకుళించుకున్న పద్మాలను ఎలాగ పోలుస్తాము?
వివరణ: పద్మాలు పొద్దున్న పూటల విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు ముడుచుకుపోతాయి. కానీ వక్త ప్రేయసి ముఖం రాత్రుళ్ళు ముకుళించుకోవట్లేదు కనుక (నే) పద్మాలతో పోలిక న్యాయం కాదంటున్నాడు (పొద్దున్న విచ్చుకునే విషయంలో రెండూ సమానమే అని ఉద్దేశం).


ఈ అలంకారాన్ని కూడా మన సినీకవులు అంతగా వాడుకోలేదు అనుకుంటున్నాను. నా మాటను ఉదాహరణలతో సవరిస్తే సంతోషపడతాను.



పొడిగింపు:

మందాకిని/లక్ష్మీదేవి గారు వ్యాఖ్యలో చెప్పిన పాటనుండి:

చిత్రం: స్వప్న, రచన: ఆత్రేయ, సంగీతం: సత్యం, పాట: ఇదే నా మొదటి ప్రేమ లేఖ
మెరుపని పిలువాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం
పూవని పిలువాలంటే ఆ సొగసు ఒక్క దినం